వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రామన్న చెరువు కట్ట తెగింది. దీంతో.. 216వ నంబర్ ఒంగోలు, దిగమర్రు జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జాతీయ రహదారిపై దాదాపు అర కిలోమీటర్ మేర.. రోడ్డుపై దాదాపు మూడు అడుగుల వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో.. జాతీయ రహదారిపై వెళ్ళే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలను అటు వైపు వెళ్లకుండ దారి మళ్లిస్తున్నారు.
Read Also: Annamaya District: గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా.. అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
మరోవైపు.. వరద పరిస్థితిపై జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఫీల్డ్లోకి స్వయంగా వచ్చి సమీక్షించారు. తుఫాన్ ఎఫెక్ట్ను ఎదుర్కోవడానికి జిల్లా వ్యాప్తంగా 18 పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. వాగులు రోడ్లపై ప్రవహించే ప్రాంతాల్లో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వరదల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూడగలిగాం.. మరో రెండు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అవసరమైతే మరికొన్ని టీంలను రంగంలోకి దించుతామని పేర్కొన్నారు. మరోవైపు.. చెట్లు పడిపోయిన చోట్ల కట్టర్లు, జేసీబీలను సిద్ధంగా ఉంచామని అన్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు.