Rain Alert In AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే, సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Read Also: RJD: బీహార్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన ఆర్జేడీ.. అయినా ఎందుకు ఘోర పరాజయం.?
ఇక, సోమవారం ( నవంబర్ 17న) నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని చెప్పుకొచ్చింది. మంగళవారం (నవంబర్ 18న) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనుండగా, ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, నవంబర్ 21వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం దీని ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.