Site icon NTV Telugu

Harish Rao: రేవంత్ చీఫ్ మినిస్టర్‌ కాదు, కటింగ్ మాస్టర్.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!

Harish Rao Vs Revanth Reddy

Harish Rao Vs Revanth Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు అని, కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ జేబులో కత్తెర పెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కట్ చేస్తున్నాడని విమర్శించారు. రిబ్బన్ కత్తిరించడం లేదంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు కట్ చేయడమే రేవంత్ పని అని పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిందని చెబుతున్న సీఎం రేవంత్.. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ నగరంకి నీళ్లు ఎలా తీసుకువెళ్తున్నాడు? అని ప్రశ్నించారు. కేసీఆర్ చెమటోడ్చి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అని, మల్లన్నసాగర్ ప్రాజెక్టు సీఎం రేవంత్ నాన్న కట్టారని నీళ్లు తీసుకువెళ్తున్నారా? అని మండిపడ్డారు. తలకిందులుగా తప్పస్సు చేసినా ఇక సీఎం రేవంత్ మాటలను ఇక ప్రజలు నమ్మరు అని హరీష్ రావు అన్నారు.

తెలంగాణ బీజేపీ ఎంపీలకు హరీష్ రావు సవాల్ విసిరారు. వడ్లకో నీతి, గోధుమలకో నీతా అని అడిగే దమ్ముందా? బీజేపీ ఎంపీలకు అని అడిగారు. బీజేపీ అంటే తెలంగాణను మోసం చేసిన పార్టీ అని.. బీజేపీది సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ కాదు, పూరా బక్వాస్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే తెలంగాణను మోసం చేసిన పార్టీ అని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే కేంద్రం మెడలు వంచి పనులు చేసుకోవచ్చు. ఏపీలో టీడీపీ ఇప్పుడు అదే చేస్తుంది. సీఎం రేవంత్ కేరళ, కర్ణాటక, ఢిల్లీ తిరగడానికి సరిపోతుంది. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ నడుస్తుంది. పోలీసులు మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే పింక్ బుక్కులో రాసుకుంటాం. మా ప్రభుత్వం వచ్చాక ఆ పోలీసుల పని పడతాం. కేసీఆర్ వచ్చాకే మార్కెట్ కమిటీల్లో బీసీలకు అవకాశం ఇచ్చాం’ అని హరీష్ రావు చెప్పారు.

Also Read: Komatireddy Venkat Reddy: మీలాగా మాటలు కాదు చేతల ప్రభుత్వం మాది.. హరీష్ రావుకు కోమటిరెడ్డి కౌంటర్!

‘సంగారెడ్డి జిల్లాలో లక్షా 20 ఎకరాల సాగు కోసం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు తెచ్చాడు కేసీఆర్. త్వరలో సంగమేశ్వర బసవెశ్వర ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి అని జనాలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రామిసరి నోట్, బాండ్ పేపర్లకు విలువ లేకుండా చేసింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చాక కొత్త పింఛన్లు ఇవ్వలేదు కానీ 2 లక్షల పింఛన్లు తీసేశారు. రెండు నెలల పించన్ ఎగ్గొట్టారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రతి గ్రామంలో పంచాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓటు అడగటానికి వస్తే హామీలపై నిలదీయండి. కల్యాణ లక్ష్మీ పథకంలో 8 లక్షల తులాల బంగారం కాంగ్రెస్ పార్టీ బాకీ పడింది. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రేవంత్ ఎన్నికల ముందు రజిని కాంత్ తర్వాత గజిని కాంత్ లా అయ్యాడు. ఫ్యూచర్ సిటీలో రోడ్లు, మూసి సుందరికరణ కోసం నిధులు ఉంటాయి. ప్రజలకు ఇచ్చే పథకాల కోసం మాత్రం నిధులు ఉండవు. కేసీఆర్ 33 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే రేవంత్ 19 వేల కోట్ల రూపాయలే రుణమాఫీ చేశారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని దద్దమ్మ, చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ గెలవడం పక్కా’ అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version