Harish Rao: అమెరికా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని ప్రకటించారు. ఫార్మా సిటీకి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని, ప్రాజెక్టు లక్ష్యాల్లో మార్పులు జరిగితే రైతుల భూములను తిరిగి ఇవ్వాల్సిందేనని పార్లమెంట్ చట్టంలో నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోందని ఆరోపించారు. ఇటీవల తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం ఫార్మా సిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నట్లు తెలిపిందని హరీష్ రావు అన్నారు. బయట ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రచారం చేస్తూ, కోర్టులో మాత్రం వేరే వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ఫార్మా సిటీతో పాటు విద్య, గృహ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం సహజమేనని, కానీ అసలు ప్రాజెక్టు లక్ష్యాన్ని మార్చడం సరైన విధానం కాదని హరీష్రావు అభిప్రాయపడ్డారు. ఫార్మా సిటీ కోసం ఉద్దేశించిన భూభాగంలో ప్రధాన భాగాన్ని ఇతర వ్యాపార అవసరాలకు వినియోగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఫార్మా సిటీ ప్రాజెక్టును ప్రారంభించామని, రాష్ట్రం నుంచి ఒక్క ఫార్మా కంపెనీ కూడా బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
