Gunmen Attack: ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు రెచ్చిపోయారు. రెండు సార్లు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర-మధ్య నైజీరియా బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో మార్కెట్ ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం సాయుధులు విచక్షణ రహితంగా కాల్పులు జరపగా.. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. బుధవారం అదే ప్రాంతంలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. ఈ కాల్పుల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. అయితే, ఈ దాడుల వెనుక ఉన్న ఉద్దేశం తెలియలేదు. కానీ ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ ఈ దాడులకు బాధ్యత వహించలేదని తెలిపారు.
అయితే, ఈ ప్రాంతంలో రైతులు, స్థానిక పశువుల కాపరుల మధ్య గొడవలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్థానిక పశువుల కాపరులే ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 47 మందిని కాల్చి చంపినట్లు ఒటుక్పో స్థానిక ప్రభుత్వ చైర్మన్ తెలిపారు. ఈ ఘటనకు ఒక రోజు ముందు, అదే స్థలంలో ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. బెన్యూ స్టేట్ పోలీసులతో అనెన్ సీవీస్ ఈ దాడిని ధృవీకరించారు. దుండగులు అకస్మాత్తుగా మార్కెట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని, ఈ దాడిలో ఒక పోలీసు అధికారి కూడా మరణించినట్లు సీవీస్ తెలిపారు.
నైజీరియోలోని బెన్యూ రాష్ట్రాన్ని అక్కడి ప్రజలు ‘నైజీరియా ఫుడ్ బాస్కెట్ ‘గా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇక్కడ సమృద్ధిగా పంటలు పండతాయి. అయితే, కాపరులు తమ పొలాల్లో పశువులు మేపుతూ పంటలు నాశనం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1965లో తొలిసారిగా చట్టం ద్వారా ఆ భూములన్నీ తమకు చెందుతాయని పశువుల కాపరులు నొక్కి చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తరచూ జరిగే ఈ ఘర్షణల వల్ల రాష్ట్రం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గిపోయాయి. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగదీస్తోంది.