తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి ఆశాభంగమే ఎదురైంది. వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న వారికి తక్షణ ఉపశమనం లభించకపోగా.. ప్రభుత్వం పీఆర్సీ (Pay Revision Commission) గడువును మళ్లీ పొడిగించింది. అసలు ఈ కమిటీ గడువు మార్చి 31తో ముగియాల్సి ఉండగా.. తాజాగా దాన్ని సెప్టెంబర్ చివరి వరకు ఆరు నెలలు పెంచే నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త వేతనాల అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులు కొత్త పీఆర్సీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలను వివరించాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల కారణంగా ప్రస్తుతం ఉన్న జీతాలు సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ఎన్నికల సమయంలో మూడు నెలల్లో కొత్త పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, ఇంతకాలం ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తూ, కనీసం ఇప్పటికైనా నివేదిక తీసుకుని అమలు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Also Read:GST Scam: రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం బట్ట బయలు.. తెలుగు రాష్ట్రాలలో 72 షెల్ కంపెనీలు గుర్తింపు..!
అయితే ప్రభుత్వం మాత్రం త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం కన్నా కమిటీకి మరింత సమయం ఇవ్వడానికే మొగ్గు చూపింది. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కొత్త పీఆర్సీ అమలు ఎప్పుడవుతుందనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం మరింత పెరిగింది.