Gold Sales Decline: దేశంలో బంగారం ధరలు అమాంతం పెరగడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో పసిడి మార్కెట్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో కళకళలాడాల్సిన బంగారం దుకాణాలు ఇప్పుడు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారం కొనుగోళ్లపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ అంశంపై ఎన్టీవీతో మాట్లాడిన ఏపీ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి బంగారం కొనవద్దని చేసిన పిలుపు తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, దాని ప్రభావంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదని తెలిపారు.
గత రెండు నుంచి మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కూడా షాపులకు ఆశించిన స్థాయిలో కస్టమర్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందన్నారు. ఈ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
గోల్డ్ బాండ్ల స్కీమ్ ప్రభావం కూడా కేంద్రంపై ఎక్కువగా పడిందని సత్యనారాయణ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కేంద్రానికి భారంగా మారిందని, అందుకే బంగారం కొనుగోళ్లను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బంగారం పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ సమస్యలను వివరించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంగారం ధరలు భారీగా పెరగడం, కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కలిపి మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులను సృష్టిస్తున్నాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
