Godavari Floods: తెలంగాణ రాష్ట్రంలో ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్ వద్ద వరద నీరు జ్ఞాన దీపాలను ముంచేయగా, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ తీరంలో ఉన్న చిన్న వ్యాపారస్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పూర్తిగా నిండుకుండలా మారింది. భారీగా వరద పోటెత్తడంతో మొత్తం 85 గేట్లు ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ఫ్లో రెండూ 9,02,550 క్యూసెక్కులుగా నమోదయ్యాయి.
అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 40 గేట్లు ఎత్తి, 2 లక్షల 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1 లక్ష 75 వేల క్యూసెక్కులు కాగా, నీటి మట్టం ప్రస్తుతం 1087.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. మొత్తం సామర్థ్యం 80.5 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 66.783 టీఎంసీలుగా ఉంది.
Samsung TV Plus: ఈటీవీ, శాంసంగ్ భాగస్వామ్యం.. శాంసంగ్ టీవీ ప్లస్లో ఈటీవీ ఛానెల్స్!
మరోవైపు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద నీరు వస్తోంది. అధికారులు 16 గేట్లు ఎత్తి, 75 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో, ఔట్ఫ్లో రెండూ 75 వేల క్యూసెక్కులు. ప్రస్తుతం నీటిమట్టం 1403.50 అడుగులు, పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు. మొత్తం నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 15.667 టీఎంసీలుగా ఉంది. ఈ వరదల కారణంగా ప్రాజెక్టులు వరుసగా నిండుకుండలా మారుతున్నాయి. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.