హైదరాబాద్ నగరంలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న పన్నులను త్వరితగతిన వసూలు చేయడంతో పాటు… పౌరులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనున్న నేపథ్యంలో.. ఈ నెల మార్చి 31వ తేదీలోగా తమ ఆస్తి పన్ను బకాయిలను చెల్లించే వారికి వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. అంటే.. మీరు కట్టాల్సిన అసలు పన్నుతో పాటు, కేవలం 10 శాతం వడ్డీని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
Also Read:North Korea: కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. కారణం ఇదేనా..?
నగరవాసులు తమ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. అధికారిక వెబ్సైట్ www.ghmc.gov.in ద్వారా నేరుగా చెల్లించవచ్చు. లేదా MyGHMC యాప్ ద్వారా సులభంగా పేమెంట్ చేయవచ్చు. మీ-సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్ల (CSC)లో కూడా బకాయిలు కట్టే వెసులుబాటు ఉంది.
Also Read:House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించి ఈ 90 శాతం వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చి 31 తర్వాత ఈ అవకాశం ఉండదని, గడువులోపు చెల్లించి అదనపు భారం తగ్గించుకోవాలని సూచించారు.
