విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఈ సారి టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఈ సీనియర్ ఆటగాళ్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో సెలక్టర్లకు జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కెప్టెన్పై సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. సీనియర్లు లేని జట్టులో మరో ఇద్దరు సీనియర్లు జట్టుకు దూరం కానున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు మహ్మద్ షమీ దూరం అయ్యే అవకాశముంది. షమీ ఫిట్నెస్ పై వచ్చిన నివేదిక దృష్ట్యా సెలెక్టర్లు షమీని ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపిక చేసే అవకాశం లేదట. తాజాగా మహ్మద్ షమీ ఫిట్నెస్పై బీసీసీఐ వైద్య బృందం బోర్డుకు అప్డేట్ ఇచ్చింది. షమీ లాంగ్ స్పెల్స్ బౌలింగ్ చేయలేడని వైద్య బృందం నిర్ధారించింది.
READ MORE: Kamal Haasan : అందుకే నాకు డబ్బు కావాలి.. కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ నేపథ్యంలో సెలెక్టర్లు షమీ విషయంలో రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అయితే దీనికి సంబంధించి అఫిషియల్ ప్రకటన లేనప్పటికీ త్వరలో బీసీసీఐ నిర్ణయం ప్రకటించనుంది. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా విషయంలో సెలెక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దీని కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేకపోయాడు. ప్రస్తుతం ఐపీఎల్లో రాణిస్తున్నప్పటికీ, ఇంగ్లాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ టూర్లో బుమ్రాని అన్ని మ్యాచ్ లలో ఆడించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. నివేదికల ప్రకారం జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే పాల్గొంటాడు. ఇదే జరిగితే ఇంగ్లీష్ గడ్డపై టీమిండియా గెలవడం కష్టంగానే కనిపిస్తుంది.