NTV Telugu Site icon

Venkaiah Naidu: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను మాతృభాషలోనే విడుదల చేయాలి..

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: తెలుగు వాడినైనందుకు ఎంతో గర్వపడుతున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భాషా ప్రాచీనతకు శాసనాలు మూలాధారాలు అని ఆయన తెలిపారు. చక్కటి తెలుగు సాహిత్యానికి పెట్టింది పేరు ప్రొద్దుటూరు అన్న వెంకయ్య… అనేకమంది పండితులు అనేక రచనలు చేసిన వారు ఈ ప్రాంతం వారేనన్నారు. భారతం, భాగవతంలోని ఎన్నో శ్లోకాలకు వ్యాఖ్యానాలు రాసిన రచయితలు ఈ ప్రాంతం వారేనన్నారు. ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పతనం రాదని.. తెలుగు వాళ్లు తెలుగు భాషలోనే మాట్లాడాలన్నారు. గిడుగు వెంకట రామమూర్తి పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. గిడుగు అంటే పిడుగు అన్న పేరును ఆయన సంపాదించుకున్నారని తెలిపారు.

Read Also: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు షాక్.. ఇకపై అదనపు లడ్డూలు కావాలంటే?

పరుచూరిలో వీధి బడిలో చదువుకున్న తాను ఉపరాష్ట్రపతిని అయ్యానన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి వీరంతా మాతృభాషలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. మాతృభాష తల్లి భాష ఎంతో గొప్పదని.. ప్రపంచంలో తెలుగు భాష నాలుగవ స్థానంలో ఉందన్నారు. ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌లో మాట్లాడుతూ తెలుగు భాషకు శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వులను మాతృభాషలోనే విడుదల చేయాలని కోరారు. పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలన్నీ మాతృభాషలోనే కొనసాగించాలన్నారు.

అధికారులందరూ తెలుగు నేర్చుకోవాలని, కోర్టులలో కూడా తెలుగు భాషలోనే వాదించాలి తీర్పులు ఇవ్వాలన్నారు. భాష పోతే తెలుగు సినిమాలు కూడా పోతాయని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగును ప్రోత్సహించాలని కోరారు. తాను ఏ సభలకు సమావేశాలకు వెళ్లినా, ప్రపంచ వేదికల పైకి వెళ్లినా తన డ్రస్సులో మార్పు ఉండదని వెంకయ్య చెప్పారు. 126 దేశాల సమావేశానికి వెళ్లాను అక్కడ కూడా తాను తెలుగు వాడిగానే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశానన్నారు. పిజ్జా బర్గర్లను బ్యాన్ చేయాలని డాక్టర్లు నాతో చెప్పారని.. తెలుగు భోజనం, తెలుగు కూరలు చాలా అద్భుతమని తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.