సార్వత్రిక ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు వెల్లడించారు. దీంతో కమలం పార్టీకి భారీ షాక్ తగిలినట్టైంది. నెలరోజుల క్రితమే బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్ లోక్సభకు రాజీనామా చేసి.. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించిన బీరేందర్ సింగ్ భార్య ప్రేమ్ లత సైతం బీజేపీకి రాజీనామా చేశారు.
బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు సోమవారం మీడియా సమావేశంలో బీరేందర్ సింగ్ ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపినట్లు తెలిపారు. 2014-2019 వరకూ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య ప్రేమ్ లత సైతం పార్టీని వీడారని చెప్పారు. భార్యాభర్తలిద్దరూ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. గతంలో నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్తో సంబంధాలు సాగించిన బీరేందర్ సింగ్ పదేళ్ల క్రితం బీజేపీలో చేరారు.
బీరేందర్, బ్రిజేందర్ సింగ్లు గతంలోనూ పలు అంశాల్లో బీజేపీతో విభేదించారు. 2020లో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రైతులు చేసిన డిమాండ్కు వీరు మద్దతు పలికారు. లైంగింక వేధింపులు ఎదుర్కొన్న మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన ఆందోళనకు సైతం మద్దతు ప్రకటించారు.
ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతోంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇక విజయంపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా హర్యానా లోక్సభ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 25న జరుగనున్నాయి.