DGP Anjani Kumar: చోరీకి గురైనా లేదా పోగొట్టుకున్న సెల్ఫోన్ల జాడను తెలుసుకునేందుకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) అనే విధానాన్ని కొత్తగా ప్రవేశ పెడుతున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) విధానంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు అవగాహన కల్పించారు. టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాజశేఖర్, డైరెక్టర్లు మురళి కృష్ణ, రాఘవ రెడ్డి , అడిషనల్ డీజీ మహేష్ భగవత్లతో కలిసి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ డీజీలు అనిల్ కుమార్, షికా గోయల్, సంజయ్ కుమార్ జైన్, శివధర్ రెడ్డి, అభిలాష బిస్త్, ఐజీలు కమలాసన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ కాసీం, డీఐజీ రమేష్ రెడ్డి, ఎస్పీలు లావణ్య, విజయ్ కుమార్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. అత్యధికంగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో సెల్ ఫోన్ ప్రధానంగా మారిందని, ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ల చోరీ, మిస్సింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. పోయిన సెల్ ఫోన్లను గుర్తించేందుకు ప్రవేశ పెడుతున్న సీఈఐఆర్ గురించి సామాన్య ప్రజలలో గ్రామాలలో, పట్టణాలలో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రపంచ టెలికాం దినోత్సవంగా మే 17న ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.
అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 750 పోలీస్ స్టేషన్లలో పోలీస్ ఆఫీసర్లకు ఈ విధానంపై శిక్షణనిస్తున్నామని తెలిపారు. సెల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ సీఈఐఆర్ గురించి తెలిసేలా పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్, డివిజన్ పరిధిలో బ్లూ కోల్డ్స్ పెట్రో కార్ సిబ్బంది ప్రతిరోజు అవగాహన కల్పించాలని తెలిపారు. సెల్ ఫోన్ పోయిందని ఎవరైనా పోలీస్ స్టేషన్కు వస్తే సంబంధిత రిసెప్షనిస్ట్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిల్ రిజిస్టర్ యాప్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. సెల్ ఫోన్/ చరవాణి ఎక్కడైనా పడిపోయిన ఎవరైనా దొంగలించుకుని పోయిన వెంటనే CEIR లో రిజిస్ట్రేషన్ చేస్తే దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) అనే అప్లికేషన్ ద్వారా చరవాణి ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా అట్టి చరవాణి లను వెతికి పట్టుకోవడానికి ఎంతో చేయూతనిస్తుందని అన్నారు.
Read Also: Sabitha Indra Reddy: ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
ఎలా కనిపెట్టొచ్చంటే..?
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in వెబ్ సైట్లో లాగిన్ కావాలి. అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి పోయిన చరవాణిలోని నంబర్లు, ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు. ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడr, ఓటిపి (OTP) కోసం మరో చరవాణి నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. చరవాణి దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోనికి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్పై క్లిక్ చేయాలి. ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. చరవాణి పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ అన్నారు.