ఆదిలాబాద్లో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం 24 గంటల సమయం నేషనల్ హైవే దిగ్బంధం చేసిన వారిలో ఇక్కడికి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. నేను చచ్చిపోయిన పర్లేదు నాతోటివారికైనా ఉద్యోగాలు వస్తాయని ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. ఆ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడితే ఆ ఫలితాలు అనుభవిస్తుంది కేసీఆర్, ఆయన కుటుంబం, వారి చుట్టాలు. మొన్న వచ్చిన వరదల్లో ఆదిలాబాద్ లో ఉన్న స్వర్ణవాగు, గడ్డనవాగు పొంగి పక్కనున్న పొలాలు అన్ని మునిగిపోయి నష్టపోయిన మహిళలు కార్చినకన్నీళ్లు ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ వారికి ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ఇవ్వలేదు కాని వేరే రాష్ట్రాల్లో మన డబ్బులు పంచిపెడుతున్నారు. 30 లక్షల మంది తెలంగాణ యువకులకు అన్యాయం చేసింది కేసీఆర్. భర్తరఫ్ చేయాల్సింది టీఎస్పీఎస్సీని కాదు కేసీఆర్ ని. కెసిఆర్ ని గద్దెదించితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. అప్పటివరకు మనం నిద్రపోవద్దు.
తెలంగాణ వస్తే తెలంగాణ ఆడబిడ్డలంతా లక్షాధికారులు అవుతారని కేసీఆర్ చెప్పారు. కానీ వడ్డీ లేని రుణాల పైసలు కూడా ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద వారి వాటా టన్షన్గా మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నా.. నాలుగు సంవత్సరాలు అయినా కేసీఆర్ డబ్బులు ఇవ్వడం లేదు. బ్యాంకులలో మహిళా సంఘాల గ్రూపులు డిఫాల్టర్ గా మిగిలిపోతున్నారు. మహిళలు రుణాలు తీసుకోవడానికి వీలు కాకుండా పోవడానికి కారణం కేసీఆర్. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లేని రుణాల పైసలు చెల్లించే జిమ్మేదార్ మాది. వివోఏ లకు 5 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. బీజేపీ వస్తే మీకు అండగా ఉంటుంది.
ధనిక రాష్ట్రం, రైతుల కోసం పుట్టిన, రైతుల కోసం పనిచేస్తున్న అని చెప్పిన కేసీఆర్ నాలుగున్నర సంవత్సరాలు అయినా రైతులకు రుణమాఫీ డబ్బులు విడుదల చేయలేదు. 7800 కోట్లకు రింగ్ రోడ్డు అమ్మి, మద్యం టెండర్లు వేసి, భూములు కుదువ పెట్టి డబ్బులు తెచ్చి రైతులకు రుణమాఫీ డబ్బులు ఇస్తున్నారు. పెన్షన్ సకాలంలో ఇవ్వడం లేదు. రైతుబంధు పూర్తి చేయలేదు. తెలంగాణ అప్పుల కుప్పగా మారింది.. దీని నుంచి బయటపడాలంటే.. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ ను బొంద పెట్టాలి.
దళిత ముఖ్యమంత్రి ఇస్తానని మోసం చేసిన కేసీఆర్.. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. టిఆర్ఎస్ ఉన్నంతకాలం కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అవుతారు తప్ప వేరే వారికి అవకాశం లేదు. 52 శాతం ఉన్న బీసీలు మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారు. అన్ని వర్గాలను కెసిఆర్ అవమానపరిచారు. కేసీఆర్ కి బుద్ధి చెప్పాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీని గెలిపించండి. బీజేపీని ఆశీర్వదించండి. రేపటి బంగారు తెలంగాణకు బాటలు వేసే బాధ్యత బీజేపీది. డబుల్ బెడ్ రూమ్ రావాలన్నా, పెన్షన్ కొనసాగాలన్నా, చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావాలన్న.. ఇచ్చే సత్తా శక్తి బీజేపీకి మాత్రమే ఉంది. బీజేపీని గొప్ప మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను’ అని ఈటల రాజేందర్ అన్నారు.
