ENG vs IND: లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారత జట్టుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే విజయ ఆనందం ఆస్వాదించక ముందే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి ఇంగ్లాండ్కు షాకింగ్ న్యూస్ ఎదురైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల కోతతో పాటు.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ తగ్గింపు జరగడం ఆ జట్టుకు పెద్ద షాక్గా మారింది.
లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక్క ఓవర్ ఆలస్యం అంటే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో రెండు ఓవర్లు తక్కువగా వేసినందుకు మ్యాచ్ ఫీజులో మొత్తం 10 శాతం ఫైన్ విధించబడింది. స్లో ఓవర్ రేటుకు సంబంధించి జరిమానాతో పాటు, ఇంగ్లాండ్ జట్టుకు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025–27 సైకిల్లో రెండు పాయింట్ల కోత విధించబడింది. ఈ నిర్ణయంతో ఇంగ్లాండ్ పాయింట్లు 24 నుంచి 22కు తగ్గిపోయాయి. దీనితో WTC స్టాండింగ్స్లో ఇంగ్లాండ్ స్థానానికి ఇది భారీ దెబ్బగా మారింది.
Read Also:Pulivendula ZPTC By-Election: కడప జిల్లాలో ఉప ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం..
ఈ తప్పిదాన్ని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అంగీకరించడంతో, ఐసీసీ ఎటువంటి విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. జట్టు బాధ్యత వహించిన నేపథ్యంలో జరిమానా విధించి ప్రక్రియ ముగిసిందని ఐసీసీ తెలిపింది. ఈ పెనాల్టీతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ మధ్యే బంగ్లాదేశ్పై గెలిచిన శ్రీలంక, ఇప్పుడు రెండో స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పరంగా జరిగిన ఈ మార్పులు సిరీస్లో కీలకంగా నిలవనున్నాయి. ఇక భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. అయితే భారత్ మాత్రం ఈ టెస్టును గెలిచి సిరీస్ను సమం చేయాలన్న పట్టుదలతో సిద్ధమవుతోంది.
🚨 ENGLAND PLAYERS FINED. 🚨
– England have been fined 10% of their match fees and docked 2 WTC points for maintaining slow overrate at Lord's. pic.twitter.com/f5BP9fbL4V
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 16, 2025