NTV Telugu Site icon

TDP: ఏలూరులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన మేయర్ దంపతులు

Tdp

Tdp

TDP: ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరిందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు.

Read Also: Andhra Pradesh: సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చేవారికి స్నేహహస్తం అందిస్తున్నామన్నారు. ఆళ్ల నాని వైసీపీ కార్యకర్తలను వదిలేసి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని తెలుగుదేశంలో చేర్చుకుంటున్నామని అన్నారు. త్వరలోనే దశల వారీగా కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరబోతున్నారని చెప్పారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం వీడి వైసీపీకి వెళ్లాల్సి వచ్చిందని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ తెలిపారు. ఆ పార్టీలోకి వెళ్లాక ఏమాత్రం అభివృద్ధి చేయలేక పోయామని విమర్శించారు. దాదాపు 40 మంది కార్పొరేటర్లు త్వరలోనే తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధoగా ఉన్నారని ఆమె వెల్లడించారు.