టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీన హైదరాబాదులోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ చెందిన సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం మహేశ్ బాబు ప్రమోషన్ నిర్వహించాడు. ఇందు కొరకు రూ. 5.9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు.
ఇందులో కొంత నగదు రూపంలో తీసుకోగా మరికొంత ఆర్టీజీఎస్ రూపంలో ట్రాన్స్ఫర్ అయింది. అయితే ఈ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు సాయి సూర్య డెవలపర్స్, సురానా కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహించినప్పుడు అవకతవకలు జరిగినట్టు బయటపడింది. సోదాలలో దొరికిన పత్రాల ఆధారంగా మహేశ్ బాబుకి ఈడి నోటీసులు ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా కంపెనీలు పెద్ద మొత్తంలో వెంచర్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు గతంలోని సాయి సూర్య డెవలపర్స్ చైర్మన్ సతీష్ గుప్తను అరెస్టు చేశారు. అదే మాదిరిగా సూరానా గ్రూపు పైన కూడా కేసు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 16వ తేదీన ఈడీ రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్ , సూరన గ్రూపులో సోదాలు నిర్వహించింది.