మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. తాజాగా అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఆరోపణలపై లిఖిత పూర్వకంగా స్పందిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. “రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ప్రాధాన్యత ఇస్తుంది. రాజకీయ పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాలు, సూచనలు, ప్రశ్నలను గౌరవిస్తాం. త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తాం. మహారాష్ట్ర ఓటర్లకు సంబంధించి పూర్తి వాస్తవాలు, విధానపరమైన అంశాలతో కమిషన్ సమాధానం ఇస్తుంది.” అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా ఈసీ పేర్కొంది.
READ MORE: Balakrishna : పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్ సీపీ-ఎస్ సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 32 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్నారు. మహారాష్ట్రలో లోక్సభ – అసెంబ్లీ ఎన్నికల సమయంలో 39 లక్షల కొత్త ఓటర్లు చేరారు. 39 లక్షల మంది కొత్త ఓటర్లు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నించారు. ఇది హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానం అని వెల్లడించారు. “మాకు లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తేడా లేదు. కానీ ఎన్డీఏ కూటమి పార్టీలకు అదనంగా ఓట్లు వచ్చి చేరాయి. ఆ ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయి. మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలి.” అని రాహుల్ గాంధీ ఈసీని డిమాండ్ చేశారు.
READ MORE: Delhi Elections: గతంలో బీజేపీ ఏం చేసిందో తెలిసిందే.. ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్న ఆప్