Duvvada Srinivas: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వెళ్తున్నట్లు చెప్పిన దువ్వాడ శ్రీనివాస్ అనూహ్యంగా కనిపించకపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం ప్రకారం.. కేసులకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కు బయలుదేరినట్లు తెలిపారు. అయితే బయలుదేరి రెండు గంటలకు పైగా గడిచినా ఆయన గమ్యస్థానానికి చేరుకోలేదు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దువ్వాడతో సన్నిహితంగా ఉన్న మాధురి స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు మధ్యలోనే అదుపులోకి తీసుకుని ఉండవచ్చని ఆమె ఆరోపించారు. ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయని అన్నారు.
అయితే ఈ ఆరోపణలను కొత్తూరు పోలీసులు ఖండించారు. దువ్వాడ శ్రీనివాస్ తమ పోలీస్ స్టేషన్కు రాలేదని, ఆయన గల్లంతు వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో దువ్వాడ ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం లభించలేదు. దువ్వాడ కనిపించకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో ముందు జాగ్రత్తగా మధురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్కు వెళ్లే ముందు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు, అనంతరం ఆయన కనిపించకపోవడం మరిన్ని చర్చలకు దారితీస్తోంది.

