Summer Cooling Drinks: భానుడి భగభగలు మొదలయ్యాయి.. మెల్లిమెల్లిగా వేసవి తాపం పెరిగిపోతోంది. అసలే పిల్లలకు పరీక్షలు అయిపోయి సెలవులు రాబోతున్నాయి. దీంతో ఎండల్లో ఎక్కడికైన బయటికి వెళ్తే వెంటవెంటనే గొంతు తడారి పోవడం సహజంగా జరుగుతుంది. ఆ టైంలో బయట దొరికే కృత్రిమ పానీయాల తాగడం కంటే, ఇంట్లోనే హెల్తీగా, సింపుల్గా తయారు చేసుకునే డ్రింక్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని, తక్షణ శక్తిని ఇచ్చే ఒక అద్భుతమైన ఎనర్జీ డ్రింక్ గురించి మీకు తెలుసా. అదే నీరసాన్ని తగ్గించి, శరీర వేడిని నియంత్రించే ‘డ్రై ఫ్రూట్ మిల్క్’. ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. దీనిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: NTR Neel: ఎన్టీఆర్ – నీల్ మూవీకి షాక్: తప్పుకున్న స్టార్ విలన్.. కారణం ఏంటంటే?
కావలసిన పదార్థాలు:
డ్రై ఫ్రూట్స్: బాదం (10), జీడిపప్పు (12), పిస్తా (12).
పాలు: 1 లీటర్.
సబ్జా గింజలు: 2 టీస్పూన్లు.
ఫ్లేవర్ కోసం: యాలకులు (2-3), సోంపు (పావు టీస్పూన్), కుంకుమపువ్వు (చిటికెడు – ఆప్షనల్).
స్వీట్నెస్: పంచదార లేదా పటిక బెల్లం (1/3 కప్పు).
చిక్కదనం కోసం: కస్టర్డ్ పౌడర్ లేదా కార్న్ ఫ్లోర్ (2 టేబుల్ స్పూన్లు).
అదనపు రుచికి: ఎండిన గులాబీ రేకులు (రోజ్ పెటల్స్).
తయారీ విధానం..
ముందుగా సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, పిస్తాలను 2-3 గంటల పాటు నానబెట్టి, బాదం, పిస్తా పై పొట్టు తీసుకోవాలి. వలిచిన డ్రై ఫ్రూట్స్ను మిక్సీ జార్లో వేసి, అందులో సోంపు, యాలకులు, ఎండిన గులాబీ రేకులు, కస్టర్డ్ పౌడర్, పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత కొద్దిగా పాలు, కుంకుమపువ్వు వేసి స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నెలో లీటర్ పాలు పోసి పొంగివచ్చే వరకు మరిగించాలి. పాలు మరిగాక, ముందుగా సిద్ధం చేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ను అందులో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి. పాలు చిక్కబడ్డాక స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన పాలలో నానబెట్టుకున్న సబ్జా గింజలు, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్ ముక్కలు వేసి కలపాలి. దీన్ని గంట సేపు ఫ్రిజ్లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ డ్రింక్లో వాడే సబ్జా గింజలు రోజ్ పెటల్స్ శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తాయి. డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన పోషకాలను అందించి తక్షణ శక్తిని ఇస్తాయి. మధ్యాహ్నం లంచ్ తర్వాత లేదా సాయంత్రం వేళల్లో ఈ డ్రింక్ తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రయోజనాలు ఇవే..
ఈ డ్రింక్లో ఉండే బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గించి, శరీరానికి వెంటనే శక్తిని ఇవ్వడానికి ఇవి సహాయపడతాయి. సబ్జా గింజలు సహజసిద్ధమైన కూలెంట్స్. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. గులాబీ రేకులు కూడా శరీరాన్ని లోపల నుంచి చల్లబరిచి, రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తాయి. ఈ డ్రింక్లో వాడే సోంపు జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. అలాగే సబ్జా గింజల్లో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
బాదం పప్పులో ఉండే ‘రిబోఫ్లావిన్’, ‘ఎల్-కార్నిటైన్’ మెదడు కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి కీ రోల్ పోషిస్తాయి. జీడిపప్పు, పిస్తాల్లో ఉండే మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలు, డ్రై ఫ్రూట్స్ కలయిక వల్ల శరీరానికి కావలసిన కాల్షియం, మెగ్నీషియం అందుతాయి. ఇది ఎముకలు, పళ్లు బలంగా ఉండటానికి దోహదపడుతుంది.
READ ALSO: Nankana Sahib Yatra: పాకిస్థాన్కు వెళ్లబోతున్న 3వేల మంది భారతీయులు.. ఎందుకో తెలుసా?