Pemmasani Chandrashekar: ‘ఓటర్లు తమ ఓటు హక్కును కచ్చితంగా ఉపయోగించుకోవాలి. నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని అనుకోవద్దు. అపార్ట్మెంట్ వాసులు కచ్చితంగా పోలింగ్ రోజు ఓటింగ్కు సమయం కేటాయించండి.’ అని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. గుంటూరులోని స్థానిక 41వ డివిజన్లలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గల్లా జయదేవ్ హయాంలో గుంటూరుకు రూ. 900 కోట్ల నిధులతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. అందులో రూ. 500 కోట్ల పనులు జరిగాయని, మిగిలిన పనులు కూడా పూర్తి అయ్యి ఉంటే గుంటూరు రూపురేఖలు మారిపోయి ఉండేవని పెమ్మసాని వివరించారు. ఓట్లలో పోలింగ్ బూత్ లు మారాయనో, ఓటు ఎక్కడ ఉన్నదీ తెలియడం లేదనో ఓటింగ్కు దూరంగా ఉండటం సరికాదని స్థానికులకు సూచించారు.
అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ.. అపార్ట్మెంట్ వాసులతో పాటు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక ఓటర్ల వివరాలు కూడా తమకు ఇవ్వాలని, ఫలితంగా ఓటింగ్ శాతం పెంచే ప్రయత్నాలు చేస్తామని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ వందనా దేవి, 46వ డివిజన్ కార్పొరేటర్ నూకవరపు బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం గుంటూరు టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని ఆయన తెలిపారు. కార్మికుల కష్టాలు తీర్చడానికి పుట్టిన పార్టీ అని ఆయన వెల్లడించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఈ పార్టీ పుట్టిందన్నారు. అలాంటి పార్టీని ఎన్టీఆర్ స్థాపించి ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, అవినీతిని అంతం చేయడం లాంటి ఎన్నో అద్భుత మార్పులను తీసుకొచ్చారన్నారు. అదే విధంగా చంద్రబాబు తెలుగు వారి కీర్తిని ప్రపంచం నలుమూలలా వ్యాపింప జేశారన్నారు.