Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కారస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గించదని, ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్లో జరిగిన ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ అనంతరం మీడియాతో మాట్లాడారు ట్రంప్.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇది ఆ యుద్ధంతో సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు, కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనలో నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 31 ఏళ్ల కోల్ టోమాస్ అలెన్ అనే వ్యక్తి ఒంటరిగా దాడికి పాల్పడినట్లు సమాచారం. అతను పలు ఆయుధాలతో భద్రతా చెక్పాయింట్ వైపు దూసుకెళ్లి కాల్పులు జరిపాడని ట్రంప్ తెలిపారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన సీక్రెట్ సర్వీస్ అధికారి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని పేర్కొన్నారు.
ఈ ఘటనతో డిన్నర్ కార్యక్రమం రద్దు చేయబడింది. అయితే భద్రతా వ్యవస్థలు సమర్థంగా పనిచేశాయని ట్రంప్ ప్రశంసించారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు నిందితుడి ఉద్దేశ్యంపై విచారణ కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇక మరోవైపు ఇరాన్తో శాంతి చర్చల కోసం పాకిస్థాన్కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధుల పర్యటనను ట్రంప్ రద్దు చేశారు. చర్చలు ఫలప్రదంగా లేవని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “మనం బలమైన స్థితిలో ఉన్నాం. వాళ్లు మాట్లాడాలంటే వాళ్లే ముందుకు రావాలి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో కూడా ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ దేశంలో అంతర్గత గందరగోళం ఉందని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికి కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఇరాన్ ప్రతిదాడులు చేస్తూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
