Donald Trump: భారత్‌ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?

Trump

Trump

Donald Trump: భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక, వాణిజ్య బంధాలు సరికొత్త స్వర్ణయుగంలోకి అడుగుపెట్టబోతున్నాయి. రాబోయే ఏడాది (2027) ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఓ కీలక ప్రకటనలో వెల్లడించారు. ఈ చారిత్రాత్మక వీవీఐపీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందాన్ని (ట్రేడ్ డీల్) వీలైనంత త్వరగా ఖరారు చేసేందుకు తానే స్వయంగా భారత్‌కు రానున్నట్లు రూబియో స్పష్టం చేశారు.

ఈ పర్యటన ప్రాధాన్యతను వివరిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఉన్న అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాలే ఇరు దేశాల బలమైన బంధానికి ప్రధాన పునాది అని రూబియో కొనియాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ ఒక అంతర్జాతీయ శక్తంగా (గ్లోబల్ పవర్) ఎదిగిన తీరుకు తాను పెద్ద అభిమానిని అయ్యాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల భాగస్వామ్యం అపరిమితమైన అవకాశాలను అందుకోబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో భారత్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ‘భారీ ముడి చమురు’ (హెవీ క్రూడ్ ఆయిల్)ను శుద్ధి చేయగల అత్యుత్తమ సాంకేతికత కలిగిన కొన్ని దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు. ప్రస్తుతం ముడి చమురు సరఫరాను పెంచేందుకు భారత్, అమెరికా, వెనిజులా దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపారు.

భారత అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు

భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ పరిణామాలపై కీలక సంకేతాలు ఇచ్చారు. భారత్, అమెరికాలు సహజ భాగస్వాములని, ఇరు దేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలు దాగున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అమెరికా తీసుకురాబోతున్న కొత్త వీసా విధానంపై వస్తున్న అపోహలను తొలగిస్తూ.. ఈ కొత్త వీసా వ్యవస్థ ఏ ఒక్క దేశాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించింది కాదని స్పష్టతనిచ్చారు. అంతేకాకుండా, ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత బంధమే ఇరు దేశాల భాగస్వామ్యానికి అతిపెద్ద బలమని, అంతర్జాతీయ వేదికలపై కీలకమైన గ్లోబల్ ఇష్యూస్ విషయంలో ఇద్దరు నేతల ఆలోచనలు ఒకేలా ఉన్నాయని రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.