వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు, ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మాట్లాడే నేతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, ఆ డైలాగులను ప్రజాస్వామ్యంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదన్నారు. ఎవరు అయినా సరే చట్టాన్ని, నియమ నిబంధనలను గౌరవించాల్సిందే అని తెలిపారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న ఉద్దేశం ఏమిటో ప్రజలు గుర్తించాలని పవన్ పేర్కొన్నారు.
అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలి. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం, నియమనిబంధనలను పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది’ అని హెచ్చరించారు.
Also Read: YS Jagan: వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత!
‘కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి.. అసాంఘిక శక్తులను అదుపు చేస్తాము. అశాంతిని, అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారిని ఓ కంట కనిపెట్టాలి. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా.. వారిని సమర్థించేలా మాట్లాడే వారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలి. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దు’ అని డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్ ఇచ్చారు. సత్తెనపల్లి పర్యటన అనంతరం.. మీడియా సమావేశంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్.. పుష్ప 2 సినిమాలో డైలాగ్ (‘రప్పా రప్పా’) చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్కు పవన్ కౌంటర్ వేశారు.