NTV Telugu Site icon

AP Assembly: లిక్కర్‌పై శ్వేతపత్రం.. పవన్‌ కల్యాణ్‌, విష్ణుకుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు

Pawan 2

Pawan 2

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ స్కామ్‌పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్‌ వ్యవహారాలపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, శ్వేత పత్రంలో చెప్పిన దానికంటే మరింత అక్రమాలు జరిగాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్ర ఖజానాకు రూ. 18 వేల కోట్ల నష్టం జరిగిందన్న ఆయన.. రూ. 15 వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే ఎంతో సంబరపడ్డాం. కానీ, ఖజానాకు రావాల్సిన రూ. 18 వేల కోట్లు వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు.. మద్యం స్కాం కారకులను కచ్చితంగా శిక్షించాలని కోరారు.. తప్పు చేసిన వారిని వదిలేస్తే.. మనకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంటుంది..? అని ప్రశ్నించారు. రూ. 20 వేల లంచం తీసుకున్న ఓ సాధారణ ఉద్యోగిని శిక్షించగలుగుతున్నాం… ఇంత భారీ మొత్తంలో దోపిడీకి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అన్నారు పవన్‌ కల్యాణ్‌.. పెద్దొళ్లు తప్పు చేస్తే శిక్షలు ఉండవా? అనే ఫీలింగ్‌ను సామాన్యునికి కలగకుండా చేయాలన్నారు. మద్యం వ్యసనం తగ్గించేలా డీ-ఎడిక్షన్ సెంటర్లకు బడ్జెట్ కేటాయించాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

Read Also: CM Chandrababu: మద్యం కుంభకోణం.. సభలో సీఎం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌

ఇక, మద్యం శ్వేతపత్రంపై బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రం వాస్తవాలకు దూరంగా ఉందన్న ఆయన.. ఏపీలో రూ. 30 వేల కోట్ల మేర మద్యం స్కాం జరిగింది. రూ. 99 వేల కోట్ల మేర నగదు అమ్మకాలు జరిపితే మూడు శాతం కూడా అక్రమాలే జరిగాయనేలా శ్వేత పత్రంలో ఉంది. ఈ శ్వేతపత్రం చూస్తే.. తానేం దొరకలేదనే జగన్ సంబరపడతారు. సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు విష్ణుకుమార్‌ రాజు.. మరోవైపు.. మద్యం శ్వేత పత్రంపై చర్చ సందర్భంగా కీలక అంశం ప్రస్తావించారు ఎమ్మెల్యే కూన రవి. మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచి డిపోలకు వెళ్లకుండా నేరుగా మద్యం దుకాణాలకే మద్యం వెళ్లిందని.. వారంలో ఒకటి రెండు రోజుల్లో అడ్డదారిలో మద్యాన్ని ప్రభుత్వ దుకాణాలకు వెళ్లాయి. ఇలా వెళ్లిన మద్యం అమ్మకాల సొమ్ము ప్రైవేట్ వ్యక్తులకే వెళ్లాయని ఆరోపించారు.. మద్యం ఆదాయం తగ్గడానికి ఇదీ ఓ కారణంగా పేర్కొన్న ఆయన.. గత ప్రభుత్వంలోని మద్యం అక్రమాలపై అధికారులు ఇంకా పూర్తి సమాచారం ఇవ్వలేదు.. పూర్తి సమాచారం ఇస్తే.. తమకు ఇబ్బంది అవుతుందని కొందరు అధికారులు భయపడుతున్నట్టున్నారు. లిక్కర్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు కూన రవి.