హైదరాబాద్ రవీంద్ర భారతిలో గిరిజన ఉద్యోగ విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, గిరిజన ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మనది ప్రజలందరిది.. తాడిత, పీడిత, దళిత, గిరిజన అణగారిన వర్గాలు నోరు లేనటువంటి వారికి గొంతుకగా నిలిచేదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన దళిత గిరిజన వర్గాలను అభ్యున్నతిలోకి తీసుకురావాలని.. ఉన్నతమైన ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తెచ్చామని తెలిపారు. ఈ చట్టం ద్వారా నిధులను జనాభా దామాషా ప్రకారం.. దళిత గిరిజనుల కోసమే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా వారికోసం నిధులను ఖర్చు పెడుతుందని డిప్యూటి సీఎం భట్టి పేర్కొన్నారు.
Bandi Sanjay: కేసీఆర్ కుటుంబం సహా.. బీఆర్ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయండి
కొలువుదీరిన కొత్త శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన శాసనసభ్యులు ఎన్నికయ్యారని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా జీవితం పట్ల అంకితభావం కలిగిన విద్యావంతులు, సమాజ సేవా తత్పరులు, ఎమ్మెల్యే అనేది పదవిలాగా కాకుండా బాధ్యత అని గుర్తించిన దళిత, గిరిజన యువ ఎమ్మెల్యేలు గెలవడం ఈ సమాజానికి మేలు జరుగుతుందని భట్టి పేర్కొన్నారు. కోరి కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తలెత్తుకొని జీవించే విధంగా.. ఇళ్లు లేని వారికి ఇండ్లు, కొలువులేని వారికి ఉద్యోగాలు, స్వయం ఉపాధి పథకాలకు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేయూతను ఇస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి తొలి క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రి మండలిలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని భట్టి పేర్కొన్నారు.
KTR: నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు..
ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే అసెంబ్లీ ప్రాంగణంలో మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని పెంచుతూ రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. మిగతా నాలుగు గ్యారంటీలను మొదటి వంద రోజుల్లో అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం వల్ల.. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా లబ్ధి పొందుతారని అన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్య, విద్య, వైద్యం తదితర సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చట్ట సభల్లో మీ గొంతుకను వినిపిస్తాం. విధానపరమైన నిర్ణయాల్లో మీ ఆర్థిక వాటా మీకు వచ్చే విధంగా కృషి చేస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.