Bhatti Vikramarka: నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తాం: ఒడిశా ముఖ్యమంత్రి

  • ఒడిశా సీఎంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ
  • నైనీ బొగ్గు బ్లాక్‌ తవ్వకాలకు కావాల్సిన అనుమతులపై చర్చ
  • పూర్తిగా సహకరిస్తామని ఒడిశా సీఎం భరోసా
Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీతో ఆయన భేటీ అయ్యారు. ఒడిశాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైనీ బొగ్గు బ్లాక్‌ తవ్వకాలకు కావాల్సిన అనుమతుల గురించి ఆ రాష్ట్ర సీఎంతో చర్చించారు. నైనీ బొగ్గు గని కేటాయింపు, వివిధ రకాల అనుమతులు, విద్యుత్ ఉత్పత్తి, తదితర అంశాలపై వీరిద్దరు ప్రధానంగా చర్చించారు. నైనీ వద్ద సింగరేణి చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని భట్టి విక్రమార్క కోరారు. ఈ క్రమంలో దీనిపై స్పందించిన ఒడిశా ముఖ్యమంత్రి నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని భరోసా ఇవ్వడంతో పాటు, తగిన చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: CM Revanth Reddy: ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు జారీ

సింగరేణి దేశంలోని మొత్తం బొగ్గు అవసరాలలో 7.5 శాతం తీరుస్తోంది. నైనీ ప్రాజెక్టు గ్రౌండింగ్ కోసం అవసరమైన అన్ని అనుమతులు ఈ ఏడాది మార్చి 23 నాటికి వచ్చాయి. ఇటీవల ప్రస్తుత ప్రభుత్వ మద్దతుతో జులై 4న అటవీ భూమిని సింగరేణికి అప్పగించారు. నైనీ బొగ్గు గని పూర్తి సామర్థ్యంతో పని చేసిన తర్వాత రాష్ట్ర ఖజానాకు రాయల్టీ, డీఎంఎఫ్‌టీ, ఇతర చట్టబద్ధమైన లెవీలతో సహా సంవత్సరానికి దాదాపు రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 1200 మందికి ఉపాధిని కల్పిస్తుంది. నైనీ బొగ్గు గనితో పాటు గని నుంచి ఉత్పత్తి చేయబడిన బొగ్గును సద్వినియోగం చేసుకోవడానికి సింగరేణి భవిష్యత్‌ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంగుల్ జిల్లాలో 2×800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా నెలకొల్పాలని ప్రతిపాదిస్తోంది. పవర్‌ ప్లాంట్‌ కోసం నివేదికను సిద్ధం చేస్తోంది.