NTV Telugu Site icon

D. Srinivas : డీఎస్ పార్థీవదేహం వద్ద నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌ బాబు

D Srinivas

D Srinivas

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ (76) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్న శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ఉంచారు. ప్రస్తుతం ఆయనను చూసేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నట్లు సమాచారం. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే.. డి.శ్రీనివాస్‌ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

 

టీపీసీసీ తరుపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు నివాళులు అర్పించారు. డీఎస్ పార్థీవదేహంపైన కాంగ్రెస్ పార్టీ జెండా కప్పిన భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబులు నివాళులు అర్పించారు. కాసేపట్లో డీఎస్ పార్థివదేహానికి పోలీసుల గౌరవ వందనం నిర్వహించనున్నారు. ఆ తరువాత నిజామాబాద్ కు డీఎస్ పార్థివదేహం తరలించనున్నట్లు సమాచారం. అయితే. శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దిగి నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచి.. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.