ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. రెగ్యులర్ బెయిల్పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే నెల 6కు తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. దీంతో ఆమె మరిన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే ఆమె తన పిల్లల పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరింది. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా బుధవారం రెగ్యులర్ బెయిల్పై ధర్మాసనం విచారించింది. దీనిపై తీర్పు మే 7న వెలువరించనుంది.
కవిత రెగ్యులర్ బెయిల్పై ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఈడీ వాదనలపై ఎల్లుండి లిఖితపూర్వకంగా తమ రిజాయిండర్ ఇస్తామని కోర్టుకు కవిత తరపు న్యాయవాది నితీష్ రానా తెలిపారు.
లిక్కర్ కేసులో ఎవరి పాత్ర ఏంటి అనేది ఈడీ వివరించింది. ‘‘లైసెన్స్, మార్జిన్ ఫీజు పెంచడంలో ఎటువంటి లాజికల్ కంక్లూజన్ లేదు. నూతన మద్యం పాలసీలో 5 శాతం మార్జిన్ నుంచి 12 శాతానికి పెంచారు. పెంచిన లాభాన్ని తిరిగి వెనక్కి పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కేజ్రీవాల్ సౌత్ గ్రూప్ల మధ్య విజయ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారు. కొత్త పాలసీ కొందరికి మేలు జరిగేలా తయారు చేశారు. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారు. లిక్కర్ స్కాం, వ్యాపారంలో ఇండో స్పిరిట్ చాలా కీలకంగా ఉంది. సుప్రీం కోర్టులో కూడా లిక్కర్ కేసులో ఉన్న వాళ్లకు బెయిల్ లభించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్ల ముడుపులు ఇచ్చారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక అంశాలు తన స్టేట్మెంట్లో ఇచ్చారు. లిక్కర్ వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటేరియట్లో కేజ్రీవాల్ను మాగుంట శ్రీనివాసులు కలిశారు. కేజ్రీవాల్ సూచన మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. కల్వకుంట్ల కవితను కలిశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ భాగస్వామ్యం కోసం ఆప్కు రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారు. కవిత రూ.100 కోట్ల రూపాయలు మాగుంటను అడిగారు. కవిత ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ చేరవేసింది. లిక్కర్ కేసులో క్విడ్ ప్రో జరిగింది. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ కోసం కవిత తరపున బుచ్చిబాబు లైజనింగ్ చేశారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవల వాట్సప్ చాట్స్లో సాక్ష్యాధారాలు దొరికాయి.’’ అని ఈడీ వాదనలు వినిపించింది. మాగుంట రాఘవ అప్రూవర్గా మారి సాక్ష్యాలను ధ్రువీకరించారని ఈడీ తెలిపింది. లిక్కర్ పాలసీ వారికి అనుకూలంగా రూపకల్పన చేసేందుకు లంచాలు ఇచ్చారని.. కోర్టు అనుమతి తోనే నిందితులు అప్రూవర్లుగా మారారన్నారు. అప్రూవర్లను అనుమానించడం అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పపట్టడమేనని ఈడీ పేర్కొంది. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.. ఎవరు ఏ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్లు ఇచ్చారనేది ఈ కేసులో అనవసరమని.. లిక్కర్ కేసులో తాను లేనని.. లిక్కర్ పాలసీ రూపకల్పన తెలియదని బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. కవిత, ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంలతో రాజకీయ ఒప్పందం ఉందని బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చారని.. కవిత తన ఫోన్లలో డేటాను డిలీట్ చేశారని ఈడీ తెలిపింది.
కవిత 10 ఫోన్లు ఇచ్చారని.. ఇచ్చిన ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చారని ఈడీ వెల్లడించింది. ఎందుకు డిలీట్ చేసారని కవితను అడిగితే సమాధానం చెప్పలేదన్నారు. మార్చి 14, 15 తేదీల్లో కవిత తన నాలుగు ఫోన్లు ఫార్మాట్ చేశారన్నారు. ఫోన్లు ఇవ్వాలని కోరిన తర్వాతే నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని.. సాక్ష్యాలను ధ్వంసం చేశారని.. సాక్ష్యులను కూడా బెదిరించారని ఈడీ వాదనలు వినిపించింది. కవిత మధ్యంతర బెయిల్ను వ్యతిరేకించిన గ్రౌండ్స్ను.. రెగ్యులర్ బెయిల్ విషయంలోనూ పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఈడీ అభ్యర్థించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆమె తీహార్ జైలుకు తరలించారు. అనంతరం సీబీఐ కూడా జైల్లో విచారంచింది. తిరిగి కస్టడీకి ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా.. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ కస్టడీకి తీసుకుని కవితను విచారించింది.