ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో మార్పు జరిగింది. తొలుత మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అయితే ఈ సమాయాన్ని మధ్యాహ్నం 3:15 గంటలకు మార్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం 3:15 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు. అయితే న్యాయస్థానం జడ్జిమెంట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెయిల్ వస్తుందన్న ఆశతో ఆప్ నేతలు ఎదురుచూస్తున్నారు.
మార్చి 21న మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఇక బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏప్రిల్ 3న ఈడీ, కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసులో తన నిర్ణయాన్ని ఏప్రిల్ 9కు రిజర్వ్ చేశారు. మరికాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. బెయిల్ వస్తుందా? లేదంటే మరోసారి వాయిదా వేస్తుందా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది.
ఇదిలా ఉంటే ఇదే కేసులో ఆప్ నేత సంజయ్సింగ్కు బెయిల్ లభించింది. ఆరు నెలల్లోనే ఆయనకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్కు కూడా బెయిల్ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. జైలు నుంచే పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే.. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడి లేడు. దీంతో కేజ్రీవాల్కు బెయిల్ రావాలని ఆప్ నేతలు కోరుకుంటున్నారు.