CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్‌జీ ధరల పెంపు..

Cng

Cng

CNG Price Hike: పెట్రోల్‌ ధరలతో పాటు సీఎన్‌జీ ధరలు కూడా వరుసగా పెరుగుతూనే ఉ్నాయి.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు సీఎన్‌జీ ధరల పెంపు కూడా అదనపు భారంగా మారింది. తాజాగా సీఎన్‌జీ ధరను కిలోకు రూ.2 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో జాతీయ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.83.09కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్ సంక్షోభం కారణంగా దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇటీవలి రోజుల్లో సీఎన్‌జీ ధరలు వరుసగా రెండుసార్లు పెరిగాయి. మొత్తంగా గత 12 రోజుల్లోనే కిలోకు రూ.6 మేర ధర పెరగడం గమనార్హం. దీంతో పెట్రోల్, డీజిల్ తర్వాత ఇప్పుడు సీఎన్‌జీ కూడా సామాన్యుడి జేబుకు భారంగా మారింది. ప్రత్యేకంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాణిజ్య వాహనాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆటోలు, టాక్సీలు, స్కూల్ వ్యాన్‌లు, ప్రైవేట్ కార్లు పెద్దఎత్తున సీఎన్‌జీపై ఆధారపడుతున్నాయి. తరచూ ధరలు పెరగడం వల్ల తమ రోజువారీ ఆదాయం తగ్గిపోతోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఇంధన వ్యయాలతో జీవనోపాధి కష్టంగా మారుతోందని ఆటో, టాక్సీ యూనియన్లు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రయాణ ఛార్జీలు, సరుకు రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు.