BV Raghavulu: సీపీఎం అరకు ఎంపీ స్ధానానికి పోటీ చేస్తుందని వెల్లడించారు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. స్వతంత్రంగా గెలిచే బలం మాకు లేదు, అలాంటి ఆశ కూడా మాకు లేదన్నారు.. అయితే, అసెంబ్లీ స్ధానాలకు సంబంధించి చర్చల్లో కొన్ని తేడాలు ఉన్నాయన్నారు. మేం గొంతెమ్మ కోర్కెలు కోరే వాళ్ళం కాదు.. కాంగ్రెస్ పార్టీకి గతంలో తక్కువ ఓట్లు వచ్చిన స్ధానాల్లో మేం సీటు అడిగాం అని గుర్తుచేశారు. ఇక, వాలంటీర్ల దుర్వినియోగంపై టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోడానికే మాట్లాడుతున్నారని విమర్శించారు. వాలంటీర్ల అంశంలో బీజేపీ సుద్దులకు విలువ లేదన్నారు.
Read Also: Konda Vishweshwar Reddy: నా ప్రత్యర్థి ఎవరో నాకు ఇప్పటికీ తెలియడం లేదు..
మరోవైపు, ఏపీలో పొత్తులపై హాట్ కామెంట్లు చేశారు రాఘవులు.. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏపీ ఎప్పుడు చూడనంత అపవిత్ర పొత్తుగా అభివర్ణించారు. ఏ మొహం పెట్టుకుని ముగ్గురూ కలిసారు.. ఇది ఒక నిజాయితీ లేని పొత్తు అన్నారు. అన్ని పార్టీలు మా కూటమిలో ఒకే స్ధాయిలో ఉన్నాయి.. అక్కడ మాత్రం పెద్ద పార్టీలు నిర్ణయిస్తాయన్నారు. ఇక, కేరళ సీఎం కూతురుపై కాకతాళీయంగా దొరికిన దానిని వాడుకుని చిక్కుముడి వేసి అనుమానాలు సృష్టించడానికే ఈడీ దాడులు చేస్తుందని మండిపడ్డారు. సీపీఎంపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారన్నారు. మహారాష్ట్రలో, ఒంగోలులో బీజేపీలో చేరినవారు గతంలో అవినీతిపరులుగా బీజేపీ ముద్ర వేసినవారే అని వ్యాఖ్యానించారు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. కాగా, ఏపీలో వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.. ఇక, కాంగ్రెస్-సీపీఎం-సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.