మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి కేంద్రం పదేపదే ద్రోహం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి పట్టదా? అని.. రామకృష్ణ సూటి ప్రశ్న సంధించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును కూడా కేంద్రం తుంగలో తొక్కిందని, ఏపీకి ప్రత్యేక హోదా లేదు. విభజన హామీల అమలు లేదు. విశాఖ రైల్వే జోన్ లేదు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం లేదు. రెవిన్యూ లోటు భర్తీ లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం తెగనమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 31 మంది వైసీపీ ఎంపీలు ఉన్నా చేతులు ముడుచుకున్నారే? అని ఆయన ప్రశ్నించారు. 31 మంది ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచితే ఏపీకి ఎందుకు న్యాయం జరగదు అని ఆయన అన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. మాటతప్పి మడమ తిప్పటమే జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందంటూ ఆయన విమర్శించారు.