Congress Star Campaigners: 2026 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ తన ప్రచార వ్యూహాలకు పదును పెట్టింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం అధికారికంగా తన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను విడుదల చేసింది. ప్రతి రాష్ట్రానికి 40 మంది చొప్పున హేమాహేమీలను ప్రచార బరిలోకి దించుతోంది.
READ ALSO: IPL All-Time Records: ఐపీఎల్లో చెక్కుచెదరని 10 ఆల్టైమ్ రికార్డులు.. ఈ సీజన్లో బ్రేక్ అయ్యేనా..?
కేరళలో కాంగ్రెస్ జోరు..
కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ బలమైన నాయకులను రంగంలోకి దించింది. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కె.సి.వేణుగోపాల్, ఏ.కే.ఆంటోనీ, శశిథరూర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ ఈ జాబితాలో ఉండటం గమనార్హం. కె.సుధాకరన్, వి.డి.సతీశన్, రమేష్ చెన్నితాల, అదూర్ ప్రకాష్ వంటి కీలక నేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
అస్సాంలో అధికారంపై కన్ను..
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మళ్లీ పట్టు సాధించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు గౌరవ్ గొగోయ్, భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వంటి నేతలు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అస్సాం జాబితాలోనూ చోటు సంపాదించుకున్నారు. జితేంద్ర సింగ్, వికాస్ ఉపాధ్యాయ్, అల్కా లాంబా వంటి వారు అస్సాం గల్లీల్లో ప్రచారం చేయనున్నారు.
పుదుచ్చేరిలో పక్కా ప్లాన్..
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ తన సత్తా చాటాలని చూస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు పి.చిదంబరం, వి.నారాయణసామి, దినేష్ గుండూరావు, వి.వైతిలింగం వంటి అనుభవజ్ఞులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నారు. పుదుచ్చేరి ప్రచారానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా వెళ్లనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం, ధరల పెరుగుదల, స్థానిక సమస్యలే ప్రధాన అస్త్రాలుగా ప్రచారం సాగనుందని సమాచారం.
READ ALSO: Varanasi: రెండు భాగాలుగా ‘వారణాసి’.. జక్కన్న రియాక్షన్ ఇదే!