MP Imran Masood: “నేను పార్లమెంట్లో నమాజు చేస్తాను కానీ వందేమాతరం మాత్ర పాడను” ఇది ఒక కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ఆవరణలో ఇచ్చిన స్టేట్మెంట్. భారత స్వాతంత్య్రోద్యమంలో వందేమాతరం ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. తాజాగా అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘వందే మాతరం’ గీతం పాడే సమయంలో తప్పనిసరిగా అందరూ నిలబడాలన్న అంశంపై ఇమ్రాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “వందే మాతరం ఇప్పటికే పాడుతున్నాం. కానీ అన్ని ఆరు చరణాలు చదవాలని చెబితే నేను చదవలేను. ఎందుకంటే నా మతం దానికి అనుమతించదు. నాకు ఇక్కడ(పార్లమెంట్) ఆవరణలో సజ్దా(ఇస్లామిక్ ప్రార్థన) చేయడంలో ఎలాంటి సమస్య లేదు. కానీ నా మతం ఏమి చెబుతుందో అది పాటించే స్వేచ్ఛను నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది” ఎంపీ అని అన్నారు. ఇమ్రాన్ మసూద్ ప్రధానంగా రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను ప్రస్తావించారు. దేశానికి గౌరవం ఇవ్వడంలో తాను వెనుకాడనని, కానీ తన మత పరిమితులను దాటలేనని స్పష్టం చేశారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా మాత్రమే కాకుండా, సమాజంలో కూడా పెద్ద చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది.
READ MORE: Maha Shivratri 2026: మహాశివరాత్రి ఉపవాసం విరమించడానికి శుభ సమయాలు ఇవే.. ఈ తప్పులు చేయకండి!
మరోవైపు… వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలనూ పాడాలంటూ జారీ చేసిన ఉత్తర్వులు ఏకపక్షం, నిర్హేతుకమని ప్రముఖ ముస్లిం సంస్థ జమీయత్ ఉలామా-ఏ-హింద్ వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛపై దాడి అని జమీయత్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. ‘‘వందేమాతరం పాడకుండా ముస్లింలు ఎవరినీ నిరోధించరు. కానీ గేయంలోని కొన్ని చరణాలు మాతృభూమిని ఓ దేవతలా స్తుతించేలా ఉన్నాయి. ఇది ఇస్లాం లాంటి ఏకధర్మ మతాల ప్రాథమిక విశ్వాసానికి విరుద్ధం. ఆర్టికల్ 25తో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను ఇది ఉల్లంఘిస్తోంది. కేంద్రం ఆదేశాలు మైనార్టీల రాజ్యాంగ హక్కులను హరించే యత్నం’’ అని మౌలానా పేర్కొన్నారు.
