NTV Telugu Site icon

Jagga Reddy: గంగా ప్రక్షాళన మోడీ అందుకే చేస్తున్నారా..?

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీల నాయకత్వంలో 8 నెలల క్రితం అధికారం ఇచ్చారని.. ఈ 8 నెలల కాలంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, సీనియర్ మంత్రుల నాయకత్వంలో రైతు రుణమాఫీ అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. గత పదేళ్లలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి..రేవంత్ సీఎం అయ్యాకా ఎలా నడుస్తున్నాయో చూడాలన్నారు. గతంలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్నారు. గతంలో కోమటిరెడ్డి, సంపత్‌లను సస్పెండ్‌ చేశారని గుర్తు చేశారు. ఈ 8 నెలల్లో మూడు సార్లు నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిచాయన్నారు. రేవంత్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు హుందాగా నడుస్తున్నాయని వెల్లడించారు. కేసీఆర్‌ ఒక్కసారి సభకు వచ్చారని ఆయన చెప్పారు. హరీశ్‌, కేటీఆర్‌లు అధికార పార్టీ కంటే ఎక్కువ సమయం సభలో మాట్లాడారని వెల్లడించారు. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నా నిందలు వేస్తున్నారంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. నిందలు వేయడం తప్పా బీఆర్‌ఎస్‌కు ఏం తెలియదని విమర్శించారు. బీజేపీ నేతలు కూడా మాటలు మాట్లాడటమే తప్పా చేతలు లేవని వ్యాఖ్యానించారు.

Read Also: CPI Narayana: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరు..

మూసీని సుందరీకరణ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని.. మూసీ ప్రక్షాళన డబ్బుల కోసమేనని బీజేపీ నేతలు అంటున్నారని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. చేస్తే డబ్బుల కోసం అంటారు..చేయకపోతే చేయడం లేదు అంటారని.. మరి ఏం చేయాలంటూ ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి స్పష్టత ఉందా.. లేదా? మూసీ ప్రక్షాళన చేయొద్దు అని తీర్మానం చేసి చెప్పాలంటూ పేర్కొన్నారు. అంతే కానీ అభాండాలు వేయొద్దన్నారు. గంగా ప్రక్షాళనలో మోడీ అవినీతి కోసం చేస్తున్నారా అంటూ జగ్గారెడ్డి బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సెక్రటేరియట్ అంతా కళకళలాడుతుందన్నారు. సెక్రటేరియట్‌లో అసలు పార్కింగ్‌కి జాగా సరిపోవడం లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా లేను కానీ, సమస్యలను మంత్రులు చెప్తే రెస్పాండ్ అయ్యి చేస్తు్న్నారని తెలిపారు. సమస్యలు వినే వాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు బురద జల్లే పని పెట్టుకున్నారని విమర్శించారు.

ముచ్చెర్లలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారని.. దాని గురించి ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబులు అమెరికాలో పెట్టుబడుల కోసం వెళ్లారని తెలిపారు. బీజేపీ నేతలు కోతల రాయుళ్లు అని.. బీజేపీ మంత్రులు కిషన్‌ రెడ్డి, సంజయ్‌లకు పౌరుషం ఉంటే ఐటీఐఆర్‌ మంజూరు చేయించాలన్నారు.