CM YS Jagan: వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.. క్యాంపు కార్యాలయం నుంచి వరదలపై అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. విమర్శలకు తావులేకుండా చూడాలి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం.. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాం.. టీఆర్-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నాం అని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచింది.. దీని తర్వాత, ఈ పనులు చేయడానికి కొంత సమయం ఇస్తున్నాం.. ఆ తర్వాత నేను వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను అని తెలిపారు.
బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను.. ఈ సారి కూడా నేను వస్తాను అని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. క్షేత్రస్థాయిలో మీరు చేపట్టిన చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను.. వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించండి అని ఆదేశించారు. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో అలాంటి సహాయమే అందించాలన్న ఆయన.. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్ అందించాలన్నారు. దీంతో పాటు తాగునీరు కూడా అందించాలి.. ఈ సహాయం అదని వరద బాధిత కుటుంబం ఉండకూడదని స్పష్టం చేశారు. సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000లు ఇచ్చి పంపించాలన్న సీఎం.. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలన్నారు. వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దు.. వారందరికీ కూడా రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.
ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలను కొనసాగించాలని స్పష్టం చేశారు సీఎం జగన్.. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించండి.. మిగిలిన ప్రాంతాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులను తరలించండి.. పీహెచ్సీల్లో, విలేజ్ క్లినిక్స్లో సరిపడా మందులు ఉండేలా చూసుకోండి.. పాముకాట్లకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచేలా చూసుకోండి.. పంట నష్టం, ఆస్తి నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్కోసం జాబితాను ఉంచండిఅంటూ ఆదేశాలు జారీ చేశారు. అత్యంత పారదర్శకంగా పంటనష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారం అందించండి.. అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయండి.. ఏటిగట్లమీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయండి. వరద వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బందిపడకుండా వారికోసం ఇళ్లను మంజూరుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారు. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండేవారికి రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలన్నారు. వారికి శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనది.. అవసరమైన స్థలాన్ని సేకరించి, వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను మంజూరు చేయండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
మరోవైపు.. పోలవరం ఎగువన తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వండి అని సూచించారు సీఎం జగన్.. పశువులకు గ్రాసం కొరతలేకుండా చూడండి.. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు.. తదితర నిర్మాణాల విషయంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరాను కొనసాగించాలన్నారు. పరిస్థితి మెరుగుపడేంతవరకూ వారికి రక్షిత తాగునీటిని అందించాలన్నారు. వరద బాధిత ప్రాంతాలకు నేను వచ్చినప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవ్వరూ కూడా ఫిర్యాదులు చేయకూడదన్నారు. సోమ, మంగళవారాల్లో నేను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను.. నేను ఎక్కడకు వచ్చేదీ ఆదివారం సాయంత్రం సీఎంవో అధికారులు వెల్లడిస్తారు.. క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అందిన సహాయ, పునరావాసం కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.