CM YS Jagan: భారీ వర్షాల కారణంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ్టి సూళ్లూరుపేట నియోజకవర్గం పర్యటన వాయిదా పడింది.. అయితే, సూళ్లూరుపేట వేదికగా తలపెట్టిన కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించారు సీఎం వైఎస్ జగన్.. ఓఎన్జీసీ పైపులైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు వర్చువల్గా డబ్బు విడుదల చేశారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.
ఇక, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం. వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక పోస్ట్ పోన్ చేసుకున్నాం. కానీ, మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతామని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.
మరోవైపు, ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7 వేల 50 మంది, మొత్తంగా 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్.. నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడాం.. వారి తరఫున ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో 323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించాం. 4వ విడత ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
నాలుగో విడతలో రూ.161 కోట్లు కలుపుకుంటే రూ.485 కోట్లు పరిహారంగా 23,458 కుటుంబాలకు మనం ఇవ్వగలిగాం, ఇప్పించగలిగాం అని వెల్లడించారు సీఎం జగన్.. ఇంతకుముందు 2012లో జీఎస్పీసీ అప్పట్లో ఇదే రకమైన కార్యక్రమం చేసి నష్టపోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగింది. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో రూ.78 కోట్లు ఇవ్వాల్సి ఉంటే అప్పటి నుంచి మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి. మనకన్నా ముందు చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలన చేసినా కూడా కనీసం ఇది ఇప్పించాలి, మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఆలో చన చేయలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఫస్ట్ మనం ఇచ్చేసి తర్వాత ఈ డబ్బును కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వెనక్కు ఇప్పించుకోగలిగాం. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. మంచి చేయాలనే తపన ఉంటే దేవుడి సహకారం ఉంటుందన్నారు ముఖ్యమంత్రి.
ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తోందన్నది నిన్న విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఉదాహరణగా పేర్కొన్నారు సీఎం జగన్.. 40 బోట్లు కాలిపోయాయని మన దృష్టికి వస్తే ఆదుకోవాలని తపన పడ్డాం. ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే మత్స్యకార కుటుంబాలకు మంచి జరగాలని బోటు విలువ లెక్కగట్టమని చెప్పి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ చెక్కులు ఈరోజే పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించాం. ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యాకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం మనది. ఓఎన్జీసీ అధికారులందరికీ మనస్పూర్తిగా నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.