రాష్ట్రంలో పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖలో నియామకాలపై నేడు డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నానరు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నియామకాల ప్రక్రియలో ఉన్న లోటు, పాట్లను అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Health Tips : చలికాలంలో తులసి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. విధి నిర్వహణలో తీవ్ర పని ఒత్తిడి, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుంచి కండక్టర్, క్రింది స్థాయి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఈ పాఠశాల ఉండాలని సీఎం చెప్పారు.
Read Also: Telangana Medical Jobs : 1,800 నర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు..
ఉత్తర, దక్షణ తెలంగాణలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకై తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. పోలీస్ శాఖలో గత ఏడెనిమిదేళ్ళుగా హోమ్ గార్డుల నియామకాలు లేవని, పోలీస్ శాఖలో మరింత సమర్థవంతంగా సేవలు ఉపయోగించుకునేందుకై వెంటనే హోమ్ గార్డుల నియామకాలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి తెలిపారు. హోమ్ గార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కు హోమ్ గార్డుల సేవలను మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.