అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యార్థినులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. చదువుకునే అమ్మాయిల ప్రయాణ కష్టాలను తీరుస్తూ.. త్వరలోనే వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేయనున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం, మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు..
మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థినుల సౌకర్యార్థం త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణంతో పాటు.. ఈ స్కూటీల పంపిణీ విద్యార్థినులకు విద్యాపరంగా ఎంతో తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read:Realme C83 5G: 7000mAh టైటాన్ బ్యాటరీతో రియల్మీ C83 5G.. బడ్జెట్లో బెస్ట్ లాంగ్ లైఫ్ ఫోన్!
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్లో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి.. వాటి స్థానంలో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని సీఎం తెలిపారు. నగరంలో తిరిగే డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి.. నగరం మొత్తం ఏసీ ఈవీ బస్సులతో నింపేస్తామని చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ‘జీరో ట్యాక్స్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేవలం రవాణా రంగానే కాకుండా.. ఆర్థికంగా కూడా మహిళలను బలోపేతం చేస్తున్నామని సీఎం గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన ద్వారా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని.. కాలుష్య నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.