CM Revanth Reddy: రక్తం చిందకుండా దేశం గెలవచ్చు అని గాంధీ ప్రపంచానికి చాటి చెప్పారని.. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి అభివృద్ధి పథంలో నడపచ్చు అని ప్రపంచ మేధావి అంబేద్కర్ చాటి చెప్పారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గాంధీ, అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళు అని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్పూర్తి తోనే సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ వచ్చిన మొదటి పదేళ్లలో పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏంటి అనేది ఆలోచన చేయాలని సూచించారు. దళిత గిరిజనులకు ఇచ్చిన ప్రాధాన్యత చూడాలన్నారు. కేబినెట్లో దళితులకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో పోల్చాలన్నారు. ఇంత ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలో అయిన వచ్చిందా? అని అడిగారు.
READ MORE: Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్లో కొత్త తలనొప్పి.. కీలక కార్యదర్శిని తొలగించిన సిద్ధరామయ్య
“భట్టి విక్రమార్క సమర్థవంతంగా పని చేస్తున్నారు. ఆయన బడ్జెట్ ప్రవేశ పెడితే అవమానంగా మాట్లాడుతున్నారు. దళిత బిడ్డ ఆర్థిక మంత్రి గానో.. స్పీకర్ గానో ఉండొద్దా? దళిత బిడ్డను అధ్యక్షా అని మైక్ అడగాల్సి వస్తుంది అని కొందరు సభకు కూడా రావడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఇప్పటి వరకు మీ జాతికి అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ అవకాశం కూడా వచ్చింది. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇలా అన్ని చోట్లా ప్రాధాన్యత ఇస్తున్నాం. డైట్ ఛార్జీలు 200 శాతం పెంచింది మేము. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి అన్ని వర్గాలకు ఒకే దగ్గర చదువుకునే ఏర్పాటు చేస్తున్నాం. అంబేద్కర్ ఆలోచతోనే మేము పేదలకు విద్య అందించే పనిలో ఉన్నాం. పేదలకు నాణ్యమైన విద్య అందటం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను మెరుగైన విద్యా అందించాలని మా ఆలోచన. పదేళ్ల పాలన.. రెండేళ్ల మా పాలనను బేరీజీ వేసుకోండి. ఓర్వలేక.. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువ దళిత.. గిరిజన బీసీలకు అందటం లేదా..? మేము 67 వేల ఉద్యోగాలు ఇస్తే.. 87 శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వచ్చాయి. మేం పనిలో పడిపోతుంటే కొందరు గోతులు తవ్వుతున్నారు. వాళ్ళ సంగతి మీరు చూసుకోండి.
వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళనే పాతి పెట్టండి. నల్లి కుట్లు.. వాళ్ళ సంగతి మీరు చూడండి. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులను తీర్చుతున్నాం.. గొప్ప మాటలు చెప్తున్న వాళ్ళు అంబేద్కర్ విగ్రహానికి ఎన్ని సార్లు నివాళి అర్పించారు అనేది లెక్క తీయండి.” అని సీఎం ప్రశ్నించారు.