Ramzan: రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు.హోంమంత్రి నివాసంలో సీఎం కేసీఆర్ రంజాన్ వేడుకల్లో పాల్గొని మంత్రి కుటుంబసభ్యులకు సీఎం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఆయనతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎంపీ కేశవరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రంజాన్ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సనత్ నగర్లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్, బన్సీలాల్పేట బోయగూడలోని క్యూబా మసీదు వద్ద ప్రార్థనలలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని.. మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీస్సులతో ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Read Also: Swiggy: రంజాన్ సీజన్లో బిర్యానీ కొత్త రికార్డు.. హలీమ్ వెనక్కి..! ఏ ఫుడ్ ఎలా అంటే..?
జిల్లా కేంద్రాల్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న పలువురు మంత్రులు.. అన్ని మతాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇటీవలే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనా మందిరాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీ, మాసబ్ ట్యాంక్ హాకీ మైదానం, సికింద్రాబాద్, రాణిగంజ్, మిరాలం ఈద్గా, చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు తదితర చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రంజాన్ పండగ పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని వద్ద గల ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి నూతన వస్త్రాలు ధరించి ఈద్గాకు చేరుకుని ప్రార్ధనలు చేశారు.
