CM Chandrababu Naidu: ‘సీమలో సీన్ మారింది’.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu Naidu: అమరావతిని మనం కోరుకుంటుంటే, వాటికన్ లాంటి మావిగన్ కావాలని గొడ్డలి పార్టీ అంటోందని సీఎం చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ అని మనం అనడం కాదు.. తమది గొడ్డలి పార్టీనే అని వాళ్లూ ఒప్పుకుంటున్నారని విమర్శించారు. తాజాగా చిత్తూరులో ఆయన ప్రసంగిస్తూ.. ప్రజల విషయంలో తాను సౌమ్యుడినేనని.. కానీ సంఘ విద్రోహ శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానన్నారు. సీమ ఫ్యాక్షనిజంపై తీసే సినిమాలకు కాలం చెల్లిందని.. ఇప్పుడు సీమలో సీన్ మారిందని చెప్పారు. మరో రెండేళ్లల్లో తన రాజకీయ జీవితం 50 ఏళ్లకు చేరుతుందని తెలిపారు. రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినందు వల్లే వివేకా హత్య జరిగిందన్నారు. కోడి కత్తి డ్రామా ఆడి తనని బాధ్యుడిని చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. రౌడీలు అధికారంలోకి వచ్చినందు వల్లే మాస్క్ అడిగిన డాక్టరును చనిపోయేలా చేశారన్నారు. డ్రైవరును కారు డిక్కిలో పెట్టి డోర్ డెలివరి చేశారని గుర్తు చేశారు. రాజధానిపై రోజుకో మాట మాట్లాడుతున్నారని.. కేంద్రం చట్టం చేసిన తర్వాత రాజధానిని మార్చడం కుదరదని స్పష్టం చేశారు.

పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు పొందాలంటే నైపుణ్య శిక్షణ కీలకమని..జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. “కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ చేపడతాం. గత ప్రభుత్వం ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. వివాదాల్లో ఉన్న భూములను పరిష్కరిస్తున్నాం. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు భూములకు మోక్షం కల్పించాం.
టీటీడీ నిధులతో రూ. 34 కోట్లతో కుప్పంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం. కుప్పంపై గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. కుప్పానికి నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగులు పెట్టి డ్రామాలాడారు. కుప్పానికి వచ్చిన వాళ్లు కొత్త అనుభూతి చెందేలా ఎలిఫెంట్ సఫారీ, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి వాటిని అభివృద్ధి చేస్తున్నాం. కుప్పం అభివృద్ధికి సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ వంటి వాటితో మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.