CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!

Cm Chandrababu (1)

Cm Chandrababu (1)

CM Chandrababu: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయన భారీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు సేవల అమలు, అర్జీల పరిష్కారం, పారదర్శక పాలన వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.

క్షేత్రస్థాయి అధికారులు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పించడంతో పలువురు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి గృహ నిర్మాణానికి సంబంధించి చేసిన సూచనను సీఎం అభినందిస్తూ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడంలో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాలు టాప్-3లో నిలిచాయని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలపై తీసుకుంటున్న ఫీడ్‌బ్యాక్ ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిన నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రజాదరణ పొందిందని తెలిపారు.

“గతి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి ఒక్కరి సహకారం వల్లే వ్యవస్థలు తిరిగి సక్రమ మార్గంలో నడుస్తున్నాయి. అందరి కృషితోనే బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రాష్ట్రానికి దక్కింది” అని సీఎం చంద్రబాబు అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం పది సూత్రాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, దాదాపు 24 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించామని వెల్లడించారు. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, ఆమ్కా వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని.. త్వరలో బీపీసీఎల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

ఆమ్కా ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి-బెంగళూరు ప్రాంతం ఎయిరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేవలం 36 రోజుల్లో అనుమతులు ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు. ప్రభుత్వ సేవల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను వేర్వేరుగా గుర్తించి పరిష్కరించాలని సూచించారు. ఆర్థికేతర సమస్యలు 100% పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు.

అవినీతి అనేది ఎక్కడా కనిపించకూడదు. ప్రతి ఒక్కరూ పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కలిగేలా పనిచేయాలి. అదే ప్రభుత్వానికి బ్రాండ్‌గా మారాలని సీఎం పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టర్ చేపట్టిన ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ ప్రతి నియోజకవర్గంలో నెలకు నాలుగు సార్లు పర్యటనలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నచిన్న సమస్యలైనా వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. టీమ్‌గా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావం చూపేలా పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.