ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో చంద్రబాబు, పవన్ సమావేశం అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు కేటాయించగా.. నిధులు విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు. మరోవైపు పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపైనా విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.
జల్శక్తి మంత్రితో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ రామ్ లీలా మైదానానికి వెళతారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఇద్దరు హాజరవుతారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, మంత్రులుగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు నేడు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీయే కీలక నేతలు హాజరవుతున్నారు. స్వీకారోత్సవం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రితో చర్చిస్తారు. సాయంత్రం 4:45కి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తోనూ బాబు సమావేశం అవుతారు.