Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు లోలోపల అమరావతిని “చంద్రావతి” అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు తిరుపతిని రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాల ప్రజలు అంగీకరిస్తారని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. రాజధానికి వెయ్యి ఎకరాల భూమి సరిపోతుందని, రాజధాని అంటే ప్రభుత్వ భవనాలు తప్ప మరేమీ ఉండవని అన్నారు. ఈ రోజుల్లో పరిపాలన అంతా డిజిటల్ విధానాల్లో జరుగుతోందని చెబుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో రాజధాని నిర్మాణం ఎందుకు అవసరమని ప్రశ్నించారు. లక్ష ఎకరాల భూమితో రాజధాని నిర్మాణం చేయడం వల్ల రాష్ట్రానికి అప్పులు, నష్టాలే తప్ప లాభం ఉండదన్నారు. అందుకే తిరుపతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక రాష్ట్రంలోని సహజ వనరుల వినియోగంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు చింతామోహన.. చంద్రబాబు ప్రభుత్వం సహజ వనరులను దోపిడి చేస్తోందని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల విలువైన వనరులు అక్రమంగా తరలిపోతున్నాయని, సత్యవేడులో వేలాది టిప్పర్లతో ఇసుక దోపిడీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు సిలికా, క్వార్ట్జ్ ఖనిజాలు భారీ ఎత్తున తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
డీలిమిటేషన్ వల్ల ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య అసమానతలు
దేశ రాజకీయ వ్యవస్థపై ప్రభావం చూపే డీలిమిటేషన్ అంశంపైనా చింతా మోహన్ స్పందించారు. డీలిమిటేషన్ వల్ల ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల ప్రజాప్రాతినిధ్యంలో తీవ్ర అసమానతలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఉత్తర భారతానికి 600 సీట్లు వస్తే, దక్షిణ భారతానికి కేవలం 200 సీట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశంలో ప్రాంతీయ అసమతుల్యత పెరిగే ప్రమాదం ఉందని, ఇది చాలా సున్నితమైన సమస్య అని హెచ్చరించారు. భారత్ కూడా ఒకప్పుడు Division of Germany లాగా విభజన భావజాలానికి లోనయ్యే అవకాశం ఉందని అన్నారు. మహిళా రిజర్వేషన్ వరకు పరిమితమైతే సరిపోతుందని, డీలిమిటేషన్ పెంపుపై తొందరపడవద్దని కేంద్ర ప్రభుత్వానికి సున్నితంగా హెచ్చరిస్తున్నానని డా. చింతా మోహన్ పేర్కొన్నారు.