China: చైనా గురువారం లాంగ్ మార్చ్ 2డీ రాకెట్ను 41 ఉపగ్రహాలతో ప్రయోగించింది. ఒకే మిషన్లో అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపినందుకు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. షాంగ్సీ ప్రావిన్స్లోని తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) రాకెట్ దూసుకెళ్లిందని చైనా వార్తా సంస్థ తెలిపింది. లాంగ్ మార్చ్ రాకెట్ సిరీస్లో ఇది 476వ ఫ్లయిట్ మిషన్ కావడం విశేషం. ఇటీవల చంద్రునిపై వ్యోమగాములను ఉంచాలనే లక్ష్యంతో చైనా తన కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యక్తులను పంపిన విషయం తెలిసిందే.
Also Read: Nehru Museum Renamed: నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్, బీజేపీల మధ్య తాజా వివాదం..
చైనా ప్రయోగించిన శాటిలైట్లు.. కమర్షియల్ రిమోట్ సెన్సింగ్ సర్వీసులను కల్పించనున్నాయి. ఆ శాటిలైట్లలో 36 జిలిన్-1 సిరీస్కు చెందినవి. గురువారం నాటి ప్రయోగంతో ఇప్పటి వరకు చైనా మొత్తం 108 జిలిన్-1 శాటిలైట్లను ప్రయోగించినట్లు జిన్హువా తెలిపింది. దీంతో 100 కంటే అధిక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలతో కూడిన మొదటి వాణిజ్య కూటమిగా చైనా అవతరించిందని వెల్లడించింది. జిలిన్-1 శాటిలైట్ను 2015లో చైనా ప్రయోగించింది. ఆ శాటిలైట్ బరువు సుమారు 420 కేజీలు ఉంటుంది. ప్రస్తుతం ఈ శాటిలైట్ల బరువు కేవలం 22 కిలోలు మాత్రమేనని తెలిపింది. 2030 నాటికి చంద్రునికి వెలుపల, భూమిపై కార్యకలాపాలకు మధ్య కమ్యూనికేషన్ వంతెనగా పనిచేసే రిలే శాటిలైట్స్ను రూపొందించేందుకు చైనా కృషి చేస్తోంది. 2030 నాటికి చంద్రుడిపై వ్యోమగాములను దింపాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్ష రంగంలో చైనా వేగవంతమైన పురోగతి సాధించడంతో పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్తో మధ్య పోటీకి దారితీసింది.