Chandrababu: నూటికి నూరు శాతం ఓట్లేసి రాష్ట్రానికి దారి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పోస్టల్ ఓటింగ్లో ఉద్యోగులు నిబద్ధతతో ఓట్లు వేశారన్నారు. 80శాతం ఓట్లు కూటమికి పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ఉద్యోగులు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. విషపూరిత మద్యం కారణంగా 31వేల మంది మరణించారని ఆయన తెలిపారు. గురువారం రాత్రి విశాఖ సీతంపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఐటీ, టూరిజం డెస్టినేషన్గా వుండాలి కానీ.. నగరానికి డ్రగ్స్, గంజాయి వస్తోందన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపి బటన్లు నొక్కుతానని మోసం చేశారని.. తన జీవితంలో ఎప్పుడూ నేరపూరిత ఆలోచనలు చేయలేదన్నారు. రాజకీయ రౌడీలను ఉపేక్షించేది లేదన్నారు. మెడ మీద కత్తి పెట్టి ల్యాండ్ గ్రాబింగ్కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నారు.
Read Also: AP Weather: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు
జైల్లో తనను లేపేయడానికి చాలా ప్రయత్నాలు చేశారని చంద్రబాబు అన్నారు. చాలా ప్రయత్నాల ద్వారా తనను ఇబ్బంది పెట్టారన్నారు. మూడో సారి ప్రధాని అయ్యేది నరేంద్ర మోడీనే అని ఆయన చెప్పారు. కేంద్రం ఆలోచన వికసిత్ భారత్ అయితే మా విధానం వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు తెలిపారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగ విధానం అమలు చేస్తామని.. ఐటీ టవర్ నిర్మాణం చేసి వర్క్ కల్చర్ విస్తృతం చేస్తామన్నారు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు…..ఇంట్లో వున్న బామ్మ సరిపోతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బటన్ల ద్వారా నొక్కింది ఎంత బొక్కింది ఎంత సీఎం చెప్పాలన్నారు. ప్రజల ఆస్తులను వాళ్లకు అప్పగిస్తామని చంద్రబాబు అన్నారు.