భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్ పేయి ఎంతో కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. 9 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందని ప్రశంసించారు. వాజ్ పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశ దశ దిశ మార్చిందన్నారు. నాకు వ్యక్తిగతంగా కూడా ఆయనతో అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్డీయే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు జరిపే ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన’ యాత్రలో పాల్గొనాలని నేతలకు పిలుపునిచ్చారు.
టెలీకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘వాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు. ఈ నెల 11 నుంచి 25వ వరకు చేపట్టే ఈ యాత్రలో 3 పార్టీల నేతలు పాల్గొనాలి. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషం. దేశంలో సుపరిపాలనకు వాజ్పేయ్ నాంది పలికారు. ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయి. వాజ్ పేయి అజాత శత్రువు, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్ పేయి కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారు. 9 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోంది. 18 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1998లో పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తి చాటారు. కార్గిల్ యుద్దంతో శత్రువుకు తిరుగులేని సమాధానం ఇచ్చారు’ అని అన్నారు.
‘వాజ్ పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశ దశ దిశ మార్చింది. నాకు వ్యక్తిగతంగా కూడా ఆయనతో అనుబంధం ఉంది. రాష్ట్రాభివృద్దిలో ఆయన నాడు ఎంతో సహాయం చేశారు. రాష్ట్రం కోసం ఏది అడిగినా కాదనేవారు కాదు. ప్రజలకు పనికొచ్చే పనులు ఏం చెప్పినా చేస్తారు. పాలసీల రూపకల్పన గురించి చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారు. టెలీ కమ్యునికేషన్ రంగం, విమానయాన రంగంలో సంస్కరణలకు నాంది పలికారు. సుపరిపాలన ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్, వాజ్ పేయ్ చూస్తే అర్థమవుతుంది. ఎన్టీఆర్ కూడా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. పట్టుదల, అనునిత్యం మంచి చేయాలనే ఆలోచనతో ఉండేవారు. నాడు అణు పరీక్షలు అయినా నేడు సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా నేడు సాగరమాల అయినా అవి ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశాన్ని 2047కు నెంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారు. 2047 నాటికి ఇండియా, ఇండియన్స్ నెంబర్ స్థానానికి వెళ్తారు. యువతరానికి మోడీ ఒక స్ఫూర్తినిస్తున్నారు. వాజ్పేయ్ శతజయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలి. “అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన” కార్యక్రమాన్ని విజయంతం చేయాలి’ అని సీఎం చెప్పుకొచ్చారు.