విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ల ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి కడుపు నిండేలా చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్ల ఆలోచనకు ప్రేరణగా ఎన్టీఆర్ తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమాన్ని గుర్తుచేశారు. పేదలకు కేవలం దానం చేయడం కాకుండా.. గౌరవప్రదమైన వాతావరణంలో శుభ్రమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే ఈ పథకం ప్రత్యేకత సీఎం పేర్కొన్నారు.
‘అన్న క్యాంటీన్లలో ప్రత్యేక క్యాంపస్, కాంపౌండ్ వాల్, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాము. కేవలం రూ.5కే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా భోజనం అందించడం ద్వారా ఆటో డ్రైవర్లు, కూలీలు, రోడ్లు శుభ్రం చేసే కార్మికులు వంటి సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతోంది. ఇస్కాన్ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. ఇటీవల 62 కొత్త క్యాంటీన్లు ప్రారంభించాము. త్వరలో మరో 5 ప్రారంభించి మొత్తం సంఖ్యను 274కి పెంచుతాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మూడు పూటలా ఉచిత భోజనం అందించేందుకు రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చిన నారా భువనేశ్వరిని సీఎం అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఒక పూట భోజనం లేదా ఒక రోజు క్యాంటీన్ ఖర్చును భరించడం ద్వారా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాకుండా, ప్రజలందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాల్సిన స్ఫూర్తిదాయక వేదిక అని చంద్రబాబు అన్నారు. ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని, కేవలం ఆహారం అందించడమే కాకుండా వారి అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని తెలిపారు. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా అందరూ ఆలోచించాలని, అదే నిజమైన ప్రజాస్వామ్యం అని సీఎం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ను ‘అన్నపూర్ణ’గా నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో అన్న క్యాంటీన్లు మూసివేయబడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. పేదల కోసం పనిచేసే కార్యక్రమాలు ఎప్పటికీ ఆగకూడదన్నారు. రాష్ట్రంలోని పేదలను ఆదుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. నేడు సీఎం చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్ను సీఎం దంపతులు సందర్శించారు. ఇద్దరూ స్వయంగా పేదలకు అల్పాహారం వడ్డించి.. భోజనం చేయడం విశేషం.
